న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యూఏఈ రాజధాని అబుదాబిలో ఓ హిందూ ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభ వేడుకల్లోనూ ప్రధాని మోదీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అబుదాబిలో ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ అంగీకరించడం, అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిర ప్రారంభం నేపధ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు (2024 Loksabha Elections) ముందు మోదీని బీజేపీ హిందూ హృదయ సామ్రాట్గా దేశానికి చూపుతుందని శశి థరూర్ పేర్కొన్నారు.
2024 లోక్సభ ఎన్నికలు హిందుత్వ వర్సెస్ ప్రజా సంక్షేమంగా జరుగుతాయని అన్నారు. ఆలయాల ప్రారంభోత్సవాలు పూర్తి కాగానే ఎన్నికలకు వెళతారని తాను భావిస్తున్నానని శశి థరూర్ చెప్పుకొచ్చారు. ఆర్ధికాభివృద్ధి పేరుతో ప్రజలను ఏమార్చిన మోదీ 2019లో పుల్వామా ఉగ్రదాడి నేపధ్యంలో సాధారణ ఎన్నికలను జాతీయ భద్రతా ఎన్నికలుగా మార్చారని పేర్కొన్నారు.2024లో బీజేపీ తన మూల సిద్ధాంతమైన హిందుత్వను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని హిందూ హృదయ సామ్రాట్గా అభివర్ణిస్తూ ప్రజల్లోకి వెళుతుందని స్పష్టమైందని శశి థరూర్ వివరించారు.
అసలు అచ్చే దిన్ ఎక్కడికి పోయాయని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ప్రతి భారతీయుడి ఖాతాల్లో, జేబులో ఆదాయం ఎక్కడికి పోయిందని, ఆర్ధికాభివృద్ధి మాటేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఇలాంటి ప్రశ్నలు రానున్న ఎన్నికల్లో చర్చకు రావాల్సి ఉండగా హిందుత్వ వర్సెస్ ప్రజా సంక్షేమం దిశగా ఎన్నికలు జరగనున్నాయని వ్యాఖ్యానించారు.
Read More :
Municipal Council | మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల పిడిగుద్దులు.. వీడియో