Shashi Tharoor | కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ త్వరలో ఆ పార్డీని వీడనున్నారు. హస్తం పార్టీని వీడి ఆయన ఎన్సీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నది. ఎన్సీపీ కేరళ అధ్యక్షుడు పీసీ చాకో సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. శశిథరూర్ ఎన్సీపీలో చేరితే ఘన స్వాగతం పలుకుతామని, కాంగ్రెస్ను వీడినా తిరువనంతపురం ఎంపీగా కొనసాగుతారన్న ఆయన.. థరూర్ను కాంగ్రెస్ విస్మరిస్తోందనే విషయం తనకు తెలియదని చాకో పేర్కొన్నారు. అయితే, ఏఐసీసీఐ అధ్యక్ష ఎంపిక కోసం ఆయన నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అయితే, ఆ ఎన్నికల్లో ఖర్గే చేతిలో ఆయన భారీ మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీల్లోనూ ఆయనకు చోటు దక్కలేదు. అయితే, ఈ ఊహాగానాలను థరూర్ తోసిపుచ్చారు. తాను ఎన్సీపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. పీసీ చాకోతో చర్చించలేదన్నారు. అసంతృప్తి వార్తలపై సైతం క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను పార్టీలో ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తించలేదన్నారు. ఎవరైనా అలా అనుకుంటే రుజువులు చూపించాలని, ఇంత వివాదం ఎందుకు సృష్టిస్తున్నారు? అని ప్రశ్నించారు. ఎవరితోనూ మాట్లాడేందుకు తనకు ఎలాంటి సమస్య లేదని, తన వైపు ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు.