న్యూఢిల్లీ: మతం వ్యక్తిగతమని, రాజకీయ దుర్వినియోగం కోసం కాదని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoo) అన్నారు. జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని ఆయన తెలిపారు. ‘నేను మతాన్ని వ్యక్తిగత లక్షణంగా చూస్తా. రాజకీయ దుర్వినియోగం కోసం కాదు’ అని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆలయాలు ప్రభుత్వ వ్యవహారం కాదన్న కాంగ్రెస్ పార్టీ నేత సామ్ పిట్రోడా వ్యాఖ్యలకు ఆయన మద్దతు పలికారు.
కాగా, ఈ సందర్భంగా బీజేపీపై శశిథరూర్ మండిపడ్డారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రామ మందిరం కార్యక్రమం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునే వారి చేతుల్లో మీడియా ఆడుతోందంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రజా సంక్షేమం, జాతీయ భద్రత వంటి అంశాలను మీడియా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.