న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: వివాహేతర సంబంధం వల్ల కలిగిన సంతానానికీ వారి తల్లిదండ్రులు, పూర్వీకుల ఆస్తిలో వాటా పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. పురుషులతో పాటు మహిళలకు కూడా ఈ హక్కులు వర్తిస్తాయని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. చెల్లుబాటు కానటువంటి, రద్దయ్యే అవకాశం ఉన్న వివాహాల ద్వారా కలిగిన సంతానం కూడా చట్టబద్ధ వారసులేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
హిందూ వారసత్వ చట్టం ప్రకారం హిందూ అవిభాజ్య కుటుంబంలో తల్లిదండ్రులకు వచ్చే పూర్వీకుల ఆస్తిలో వాటా పొందే హక్కు వారికి కూడా ఉందని పేర్కొంది. తల్లిదండ్రుల ఆస్తిలో వాటా పొందేలా చట్టబద్ధ హక్కు కల్పించాలని కోరుతూ 2011 దాఖలైన ఓ పిటిషన్ను విచారించిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. మరోవైపు గతంలో వివాహేతర సంబంధం వల్ల కలిగిన సంతానానికి ఆస్తిలో వాటా పొందే హక్కు లేదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పుతో సీజేఐ ధర్మాసనం విభేదించింది.