న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా పెంచాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ ఏడవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో ఆదివారం జరిగింది. రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. రాష్ట్రాల డిమాండ్లను లేవనెత్తారు. కేంద్ర పన్నులు, సుంకాలలో రాష్ట్ర వాటాను పెంచాలని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కేంద్రాన్ని కోరారు. 20,000 కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల సమీప గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని కేంద్రం అమలు చేయాలని అన్నారు.
కాగా, నీతి ఆయోగ్ అంబుడ్స్మన్ పాత్ర వహించాలని, కేంద్ర పథకాల అమలులో రాష్ట్రాలు, కేంద్రం మధ్య వివాదాలను పరిష్కరించాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సూచించారు. పలు రాష్ట్రాల సీఎంలు వివిధ సమస్యలు, డిమాండ్లను లేవనెత్తారు.
మరోవైపు 2019 జూలై సమావేశం తర్వాత కరోనా నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశం ముఖాముఖిగా జరుగలేదు. సుమారు మూడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైర్మన్గా ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ దూరంగా ఉన్నారు.