న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. సహకార చక్కెర కర్మాగారాలు, చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు కొంకణ్ ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బేస్ ఏర్పాటుకు సంబంధించి అమిత్ షాతో పవార్ చర్చించారు. ఈ భేటీలో జాతీయ సహకార షుగర్ ఫ్యాక్టరీల సమాఖ్య చీఫ్ జయప్రకాష్ దండెగోంకర్, ఎన్సీపీ ఎంపీ సునీల్ తత్కరేలు పాల్గొన్నారు.
చక్కెర ధరల పెంపుతో పాటు ఇంధనాల్లో ఎథనాల్ మిశ్రమాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఈ సందర్భంగా అమిత్ షాను పవార్ కోరారు. చక్కెర అమ్మకం ధర ప్రస్తుతం తయారీ వ్యయం కంటే తక్కువగా ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చామని భేటీ అనంతరం పవార్ పేర్కొన్నారు. ఏటా వరదలు, తుపాన్లు, కొండచరియలు విరిగిపడటం వంటి వైపరీత్యాలు ఎదుర్కొంటున్న కొంకణ్ ప్రాంతంలో జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు.