ముంబై: తాను ఇప్పటికీ సీఎంగానే ఫీలవుతున్నానన్న మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్కు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అభినందలతో కౌంటర్ ఇచ్చారు. ముంబైలో మంగళవారం ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడారు. ‘గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో తిరుగుతున్న నేను ఇప్పటికీ ముఖ్యమంత్రిగానే భావిస్తున్నాను. నా పట్ల ప్రజల ప్రేమ, ఆప్యాయత ఏ మాత్రం తగ్గలేదు’ అని అన్నారు.
కాగా, బుధవారం మీడియాతో మాట్లాడిన శరద్ పవర్ దీనిపై స్పందించారు. సీఎంగా ఫీలవుతున్న ఫడ్నవిస్కు అభినందనలు అంటూ సెటైర్ వేశారు. ‘బీజేపీ నాయకుడు (దేవేంద్ర ఫడ్నవిస్) ఇప్పటికీ తానే ముఖ్యమంత్రిగా భావించడం మంచిదే. నేను ఆయనను అభినందిస్తున్నాను. కేవలం ఒక విడత ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవిస్ ఇప్పటికీ ఆ పదవిలో ఉన్నట్లుగా భావిస్తున్నారు. నాకు ఈ లక్షణం లేదు. నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు పని చేశాను. కానీ నాకు గుర్తు లేదు’ అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.