న్యూఢిల్లీ, ఆగస్టు 20: ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు.. కరోనా దెబ్బకు చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని దేశాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. కరోనా దెబ్బకు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్నట్టుగా ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ఉక్రెయిన్పై రష్యా యుద్ధం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తయారైంది. దిగ్గజ వ్యాపార సంస్థలు నష్టాల బాట పట్టాయి. టెక్ దిగ్గజ సంస్థలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. కరోనా తెచ్చిపెట్టిన నష్టాలను పూడ్చుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా కంపెనీలు ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నాయి. ఇప్పటికే చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపించాయి. కొన్ని కంపెనీలేమో బోనస్లు తగ్గిస్తుండగా, మరికొన్ని కంపెనీలు జాబ్ ఆఫర్లను రద్దు చేస్తున్నాయి.
అమెరికాలో 32 వేల మందిపై వేటు
కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఈ ఏడాది జూన్ నాటికి అమెరికాలో 32 వేల మంది ఉద్యోగులను కంపెనీలు తొలగించాయి. మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా చాలా మందిపై వేటు వేశాయి. భారత్లో కూడా అనేక స్టార్టప్ కంపెనీలు దాదాపు 25 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ ఒక్క ఏడాదే దాదాపు 12 వేల మంది ఉద్యోగం కోల్పోయారు. షావోమీ కంపెనీ ఆదాయం జూన్ క్వార్టర్లో దాదాపు 20 శాతం మేర తగ్గడంతో 900 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా కన్జూమర్ మార్కెట్, టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్ రంగాల ఉద్యోగులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. కాగా, హెల్త్ కేర్ రంగంలో మాత్రం నిపుణులు కొరవడ్డారు. దీంతో మానేసిన వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వేరియబుల్ పే ఆలస్యం
చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు చెల్లించే వేరియబుల్ పే (పెర్ఫామెన్స్ ఆధారంగా ఇచ్చేది)ను వాయిదా వేస్తున్నాయి. ఇప్పటికే విప్రో కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించగా, తాజాగా టీసీఎస్ కూడా అదే బాటలో నడుస్తున్నది. జూన్ 2022 క్వార్టర్కు సంబంధించిన వేరియబుల్ పే ఒక నెల ఆలస్యంగా చెల్లించనున్నట్టు సమాచారం. ట్విట్టర్ కూడా తీవ్రమైన ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నది. అందుకే ఉద్యోగుల వార్షిక బోనస్ సగమే ఇస్తామంటూ ప్రకటన చేసింది.
దారుణంగా చిన్న కంపెనీల పరిస్థితి..
కరోనా మహమ్మారికి చిన్న వ్యాపార సంస్థల పరిస్థితి మరీ తీసికట్టుగా మారింది. ఒక్క అమెరికాలోనే దాదాపు వెయ్యి చిన్న వ్యాపార సంస్థలు మూసివేత దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే అలా జరగకుండా ఉండేందుకు ఉద్యోగులపై వేటు వేసేందుకు సన్నద్ధం అవుతున్నాయి. కొత్తగా నియామకాలు చేపట్టకూడదని నిర్ణయం తీసుకున్నాయి. 85 శాతం కంపెనీలు నియామకాలను నిలిపేసేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపాయి. 78 శాతం కంపెనీలు తమ ఉద్యోగాలను తొలగించడం ద్వారా ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని చూస్తున్నామని పేర్కొన్నాయి. 43 శాతం చిన్న కంపెనీలు ఫ్రీలాన్సర్లను నియమించుకోవాలని చూస్తున్నట్టు తెలిపాయి. 70 శాతం మంది అమెరికన్లు ఆర్థిక మాంద్యం తప్పనిసరిగా వస్తుందని నమ్ముతున్నారు.
కంపెనీలకు ఎందుకీ దుస్థితి..?