ఇంఫాల్: బీజేపీ పాలిత మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలీస్ కర్ఫ్యూను నిరసనకారులు లెక్కచేయలేదు. బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. (Manipur Protests) ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. మణిపూర్లోని లోయ ప్రాంతంలో నివసించే మెజార్టీ వర్గమైన మైతీలు బుధవారం భారీ నిరసన ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించారు. కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు కుకీలు ఎక్కువగా ఉన్న చురచన్పూర్ వరకు పాదయాత్రగా వెళ్లేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో రెండు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా, మైతీ మెజారిటీ ప్రాంతమైన బిష్ణుపూర్ జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలోని చురచంద్పూర్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తాత్కాలిక బఫర్ జోన్గా పిలిచే రెండు జిల్లాల మధ్య ఉన్న ప్రాంతంలో బారికేడ్లు ఉంచారు. మైతీల నిరసన ర్యాలీ నేపథ్యంలో సమీపంలోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు.
మరోవైపు ర్యాలీని విరమించుకోవాలని ప్రభుత్వం కోరినప్పటికీ మైతీలు లెక్కచేయలేదు. కర్ఫ్యూను ధిక్కరించి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించేందుకు యత్నించారు. దీంతో భద్రతా బలగాలు రబ్బరు బుల్లెట్లతో నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.