Sonia & G-23 Congress | కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు పార్టీ నాయకత్వానికి, అసమ్మతి నేతలకు మధ్య రాజీ కుదిరిందా.. జీ-23 నేతల డిమాండ్లకు అధినాయకత్వం తలొగ్గుతుందా? అంటే తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాహుల్ గాంధీతోనూ సమావేశం కావడానికి కసరత్తు చేస్తున్నారు. గురువారం రాహుల్తో హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా భేటీ, ఆజాద్తో సోనియా సంప్రదింపుల తర్వాత జీ-23 నేతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తమలక్ష్యం అని, కానీ తమ మాట ఒక్కరూ వినే పరిస్థితిలో లేరని జీ-23 గ్రూప్ నేత ఒకరు చెప్పారు. రాహుల్తో జరిగిన భేటీలో పార్టీపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటే మీడియా ద్వారా తమ వంటి వారు ఆ వార్తలు తెలుసుకోవాల్సి వస్తుందని సీనియర్లు కినుక వహిస్తున్నారు. భవిష్యత్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో చర్చించాకే కీలక నిర్ణయాలు తీసుకోవాలని జీ-23 నేతలు డిమాండ్ చేస్తున్నారని రాహుల్కు హూడా స్పష్టం చేశారని సమాచారం. సోనియాగాంధీకి సమాచారం ఇచ్చాకే జీ-23 నేతలు సమావేశం అవుతున్నామని, తాము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టడం లేదని కూడా హుడా చెప్పినట్లు వినికిడి.
కపిల్ సిబల్, శంకర్సింగ్ వఘేలా చేసిన వ్యాఖ్యలతో జీ-23 నేతలు ఏకీభవించడం లేదని రాహుల్ దృష్టికి హుడా తెచ్చారు. రాహుల్ గాంధీని నాయకత్వ బాధ్యత నుంచి తప్పించాలని సిబల్, వఘేలా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆజాద్ ఇంట్లో జరిగిన భేటీకి ఐదుగురు మాజీ సీఎంలు, 8-10 మంది కేంద్ర మాజీ మంత్రులు హాజరయ్యారు. ఇప్పుడు అటువంటి వారి సంఖ్య పెరుగుతున్నది అని ఓ అసమ్మతి నేత చెప్పారు.
పంజాబ్లో పార్టీ సంస్థాగత నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆ రాష్ట్ర నేతల వాణి వినిపించుకోవడానికి అవకాశం ఇవ్వలేదని జీ-23 నేత ఒకరు అన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్ ఎంపీలు పూర్తిగా నిరాశానిస్పృహలతో కాలం గడిపారని పంజాబ్ నేత ఒకరు పేర్కొన్నారు. సిద్ధూ నియామకంపై చర్చించడానికి టైం కోరినా సోనియాగాంధీ నిరాకరించారని ఆ నేత వాపోయినట్లు తెలిసింది. పీసీసీ చీఫ్గా సిద్ధూ నియామకంపై ఎవరినీ సంప్రదించకుండానే రాహుల్, ప్రియాంక నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.