కొత్తగూడెం క్రైం, మే 23: దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్-నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో గురువారం చోటు చేసుకుంది. నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నారాయణ్పూర్ జిల్లా అబూజ్మడ్ పరిధిలోని ఓర్చా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీస్ అధికారులకు సమాచారం అందింది. దీంతో నారాయణ్పూర్-బీజాపూర్-దంతేవాడ జిల్లాలకు చెందిన డీఆర్జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ, బస్తర్ ఫైటర్స్ భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి.
ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. సుమారు 60 మంది సాయుధ మావోయిస్టులు ఉన్నట్లు పసిగట్టిన జవాన్లు పరిసరాలను వ్యూహాత్మకంగా చుట్టుముట్టి దాడులు నిర్వహించారు. మావోయిస్టులు వారి ధాటికి తాళలేక కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గం మీదుగా పారిపోయారు. కాల్పుల విరమణ తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఏడు తుపాకులు, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధ, వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కొందరు మావోయిస్టులకు గాయాలైనట్లు ఎస్పీ వెల్లడించారు. వీరంతా మావోయిస్టు పార్టీ 5వ కంపెనీకి చెందిన నక్సలైట్లుగా గుర్తించారు. వీరిలో పెద్ద మొత్తంలో రివార్డు ఉన్న మావోయిస్టు నాయకులు ఉన్నారని, వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు ఎస్పీ ప్రభాత్కుమార్ వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు బస్తర్ రేంజ్ పరిధిలో సెర్చింగ్ ఆపరేషన్స్లో భాగంగా జరిగిన ఎదురుకాల్పుల్లో 112 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటనతో అబూజ్మడ్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చుట్టుముట్టి గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.