అహ్మదాబాద్: ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. (family mass suicide ) మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆ ఇంటిలో సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక సమస్యల వల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. గుజరాత్లోని సూరత్లో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం అడాజన్ ప్రాంతంలోని అపార్ట్మెంట్ ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడాన్ని పొరుగువారు గమనించారు. డోర్ తట్టి, బెల్ మోగించినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, అక్కడకు చేరుకున్న పోలీసులు ఇంటి డోర్ను పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. అందులో నివసిస్తున్న కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రహించారు. మృతులను 35 ఏళ్ల మనీష్ సోలంకి, 32 ఏళ్ల భార్య రీటా, పిల్లలు ఏడేళ్ల దిశ, ఐదేళ్ల కావ్య, మూడేళ్ల ఖుషాల్, మనీష్ తల్లిదండ్రులైన 65 ఏళ్ల కాంతిలాల్ సోలంకి, 60 ఏళ్ల శోభనగా గుర్తించారు. కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు విషం తాగి చనిపోగా మనీష్ ఉరి వేసుకున్నాడు. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లుగా రాసి ఉన్న నోట్, విషం బాటిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఫర్నీచర్ వ్యాపారంతోపాటు కాంట్రాక్టర్గా పని చేస్తున్న మనీష్ సోలంకి ఆ అపార్ట్మెంట్ బిల్డింగ్లో నాలుగు ఫ్లాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చాలా కాలంగా కుటుంబంతో కలిసి ఉంటున్న అతడు చాలా మందికి డబ్బులు అప్పుగా ఇచ్చినట్లు చెప్పారు. దీపావళి పండుగ సమీపిస్తున్నందున డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడని, వారు ఇవ్వకపోవడంతో తన కుటుంబ సభ్యులకు విషం ఇచ్చిన తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. అయితే ఆ ఫ్యామిలీ సామూహిక సూసైడ్కు కారణం ఏమిటన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.