Indian pilgrims : నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి, పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన నేపాల్లోని గండకి ప్రావిన్స్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనకామన టెంపుల్లో దర్శనం అనంతరం 16 మందితో కూడిన మినీ ఎలక్ట్రిక్ బస్ తిరుగు ప్రయాణం ప్రారంభించింది.
ఈ 16 మందిలో ఒక డ్రైవర్, ఒక అసిస్టెంట్, మిగతా 14 మంది భారతీయ యాత్రికులున్నారు. బస్సు కొంత దూరం వెళ్లిన తర్వాత గోర్ఖా జిల్లాలో అదుపు తప్పింది. వెంటనే 200 మీటర్లున్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని అన్బుఖైరేనిలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు గోర్ఖా జిల్లా ట్రాఫిక్ పోలీస్ ఆఫీస్ చీఫ్ సూరజ్ అర్యాల్ తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఘటనపై సమచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రమాదానికి కారణమైన ఎలక్ట్రిక్ మినీ బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నామన్నారు. అతడి అసిస్టెంట్కు గాయాలు కాగా, అతడు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.