న్యూఢిల్లీ: బూస్టర్ డోసు సర్వీస్ చార్జీ రూ.150 మించవద్దని కేంద్ర ప్రభుత్వం శనివారం తెలిపింది. అలాగే తొలి, రెండో డోసుగా తీసుకున్న టీకానే బూస్టర్ డోసు లేదా ప్రికాషన్ డోసుగా తీసుకోవాలని సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రారంభం కానున్న ప్రికాషన్ డోసు విధివిధానాలపై చర్చించారు. దీనికి సంబంధించి పలు సూచనలు చేశారు.
దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ కలకలం రేపుతున్నది. మహారాష్ట్ర, గుజరాత్లో ఒక్కో కేసు నమోదైంది. దీంతో కరోనా ఫోర్త్ వేవ్పై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రికాషన్ డోసుగా పేర్కొనే బూస్టర్ డోసుకు కేంద్రం ప్రభుత్వం శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 18 ఏండ్లు నిండి, సెకండ్ డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు అర్హులని తెలిపింది. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో బూస్టర్ డోసు టీకాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అయితే ఇది ఉచితం కాదు. కరోనా టీకా ప్రికాషన్ డోసు కావాలనుకునేవారు డబ్బులు చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా పొందవచ్చు. దీనికి సంబంధించి కొవిన్లో రిజిస్ట్రేషన్ కోసం కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. అయితే బూస్టర్ డోసు ధర ఎంత అన్నది స్పష్టం చేయలేదు.
మరోవైపు కొవిషీల్డ్ టీకాను తయారు చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా బూస్టర్ డోసు ధర రూ.600గా పేర్కొన్నారు. పన్నులు అదనమని వెల్లడించారు. అయితే ఆసుపత్రులు, పంపిణీ దారులకు బూస్టర్ డోసు కొవిషీల్డ్ టీకాలపై భారీగా డిస్కౌంట్ ఇస్తామని ఆయన తెలిపారు. కాగా, భారత్ బయోటిక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ బూస్టర్ డోసు ధర రూ.900గా ఉండనున్నది. దీనికి కూడా పన్నులు అదనం. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రికాషన్ డోసు సర్వీస్ చార్జీ గరిష్ఠంగా రూ.150 మాత్రమే ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు పరిమితి విధించింది.