జమ్ముకశ్మీర్ వేర్పాటువాది, నిషేధిత జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) నేత యాసిన్ మాలిక్కు యావజ్జీవ శిక్ష విధిస్తూ ఢిల్లీ పటియాలా కోర్టు తీర్పునిచ్చింది. కేవలం యావజ్జీవ శిక్ష మాత్రమే కాదు.. 10 లక్షల రూపాయల జరిమానా కూడా కోర్టు విధించింది. ”రెండు జీవిత ఖైదులతో పాటు.. 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. వీటితో పాటు 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు” అని న్యాయవాది ఉమేశ్ శర్మ ప్రకటించారు. ఇక..
ఉగ్రవాదులు, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో యాసిన్ మాలిక్ దోషిగా తేలారు. దీంతో యాసిన్ మాలిక్కు ఉరిశిక్షే సరి అని కోర్టు ముందు ఎన్ఐఏ నివేదించింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ను కోరింది.
నాకెందుకు పాస్పోర్ట్ ఇచ్చారు? యాసిన్ మాలిక్
కోర్టు వాదనలు జరుగుతున్న సమయంలో యాసిన్ మాలిక్ మాట్లాడారు. తాను క్రిమినల్ అయితే.. అటల్ బిహారీ వాజ్పాయ్ ప్రభుత్వం తనకు ఎందుకు పాస్పోర్ట్ ఇచ్చిందని ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యటించడానికి ఎందుకు అనుమతి ఇచ్చిందని కూడా ప్రశ్నించారు. తాను గాంధీ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నానని, కశ్మీర్ లోయలో అహింసతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని వాదన సమయంలో మాలిక్ చెప్పుకొచ్చారు.