చెన్నై: క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్లో అరెస్టు అయిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ(Senthilbalaji)కి జూన్ 21వ తేదీన సర్జరీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సెంథిల్ బాలాజీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్లో అరెస్టు చేసిన తర్వాత సెంథిల్ను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
గుండె సంబంధిత వ్యాధికి బుధవారం ఆయన సర్జరీ చేయించుకుంటారని ఇవాళ మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు పరీక్ష చేసిన తర్వాత ఆయన గుండెలో పలు చోట్ల బ్లాక్స్ ఉన్నట్లు తెలిసిందన్నారు. జూన్ 14వ తేదీన బాలాజీకి కరోనరీ ఆంజియోగ్రామ్ చేశారని, బైపాస్ సర్జరీ చేసుకోవాలని డాక్టర్లు సూచన చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న కావేరీ ప్రైవేటు ఆస్పత్రిలోనే బాలాజీకి సర్జరీ చేయనున్నారు.