న్యూఢిల్లీ, నవంబర్ 12: ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు (Delhi Bomb Blast) కేసులో అనేక సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన దాడుల (Mumbai Blasts) తరహాలో 200 బాంబులను (ఐఈడీలు) ఉపయోగించి దాడులు నిర్వహించాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాదులు ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్ నగరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్తోసహా అనేక కీలక ప్రదేశాలను, గౌరీ శంకర్ మందిరాన్ని తమ దాడుల కోసం ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. ఉగ్రవాదుల టార్గెట్లో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, భారీ షాపింగ్ మాల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇందుకు సంబంధించిన కుట్ర జరుగుతోందని, ఈ కుట్ర సూత్రధారి అయిన ఉగ్ర మాడ్యుల్కు పాకిస్థాన్కు చెందిన ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్తో (Jaish-e- Mohammed) సంబంధాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. గడచిన అనేక నెలలుగా 200 బాంబుల(ఐఈడీలు) తయారీలో ఉగ్రవాదులు నిమగ్నమై ఉన్నారని వారు చెప్పారు. దేశంలో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకే ప్రార్థనా స్థలాలపై దాడులు చేయాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.
హర్యానాలో మౌల్వీ అరెస్టు
ఉగ్ర మాడ్యుల్పై దర్యాప్తులో భాగంగా హర్యానాలోని మేవట్కు చెందిన ఇష్తియాక్ అనే మౌల్వీని జమ్ము కశ్మీరు పోలీసులు బుధవారం అరెస్టు చేసి శ్రీనగర్కు తీసుకువెళ్లారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీ క్యాంపస్లోని ఓ అద్దె ఇంట్లో మౌల్వీ నివసిస్తున్నాడు. అతని ఇంటి నుంచే 2,500 కిలోలకు పైగా అమ్మోనియం నైట్రేట్, పొటాషియం క్లోరేట్, సల్ఫర్ని భద్రతా సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. మంగళవారం రాత్రి కశ్మీరులో మరో డాక్టర్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనగర్లోని ఎస్ఎంహెచ్ఎస్లో పనిచేస్తున్న డాక్టర్ తాజాముల్ అరెస్టుతో పేలుడు కేసుకు సంబంధించి కశ్మీరులో మొత్తం నలుగురు డాక్టర్లు అరెస్టయ్యారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టయ్యారు.
ఎరుపు రంగు ఫోర్డ్ కారు స్వాధీనం
ఎర్ర కోట పేలుడు కేసులో ప్రధాన అనుమానితుడైన డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న డీఎల్10సీకే0458 అనే ఎరుపు రంగు ఫోర్ట్ ఎకోస్పోర్ట్ కారు కోసం విస్తృతంగా గాలింపు చేపట్టిన ఢిల్లీ పోలీసులు చివరకు ఆ కారును హర్యానాలోని ఖండవలి గ్రామంలో బుధవారం కనుగొన్నారు. అందులో పేలుడు పదార్థాలు ఏవైనా పెట్టారా అన్న విషయాన్ని తేల్చేందుకు నిపుణులను రప్పించారు.
రిపబ్లిక్ డే నాడు దాడికి పథకం
ఈ ఏడాది జనవరిలో ఎర్ర కోట వద్ద డాక్టర్ ముజమ్మిల్ పలుసార్లు రెక్కీ నిర్వహించినట్లు వెల్లడైందని అధికారులు తెలిపారు. గణతంత్ర దినోత్సవం నాడు ఎర్ర కోటపై దాడి చేసేందుకు భారీ కుట్ర జరిగిందని, అందులో భాగంగానే ఈ రెక్కీ జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ సమయంలో అక్కడ పటిష్టమైన పోలీసు పెట్రోలింగ్ ఉండడంతో వారి కుట్ర భగ్నమైందని చెప్పారు.
డిసెంబర్ 6న భారీ పేలుడుకు ప్లాన్
బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన డిసెంబర్ 6న భారీ పేలుడుకు రెడ్ ఫోర్ట్ సమీపంలో పేలుడుకు గురైన కారును నడుపుతున్న డాక్టర్ ఉమర్ నబీ కుట్ర పన్నినట్లు బుధవారం అధికార వర్గాలు వెల్లడించాయి. అంతర్రాష్ట్ర వైట్ కాలర్ జైషే మొహమ్మద్ ఉగ్ర మాడ్యుల్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణపై అరెస్టయిన 8 మందిని పోలీసులు ప్రశ్నించగా ఈ సంచలన వివరాలు వెల్లడైనట్లు ఆ వర్గాలు చెప్పాయి.
కశ్మీరులోని పుల్వామా జిల్లాకు చెందిన 28 ఏళ్ల డాక్టర్ ఉమర్ నబీ కారు పేలుడు ఘటనలో మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కశ్మీరు, హర్యానా, ఉత్తరప్రదేశ్కు విస్తరించిన ఉగ్ర మాడ్యుల్లో డాక్టర్ ఉమర్ కూడా కీలక సభ్యుడని పోలీసులు భావిస్తున్నారు. అయితే తన బృందంలో సభ్యుడైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అరెస్టుతో ఉమర్ కుట్ర విఫలమైందని, తనను కూడా అరెస్టు చేస్తారన్న భయంతోనే అతను ఐ20 కారులో పేలుడు పదార్థాలను నింపి రెడ్ఫోర్ట్ సమీపంలో పేల్చివేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఢిల్లీ పేలుడు ఉగ్రవాద చర్య: కేంద్రం
ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటనను కేంద్ర క్యాబినెట్ బుధవారం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనను హేయమైన ఉగ్రవాద ఘటనగా అభివర్ణిస్తూ దీనికి కారకులైన నేరస్థులు, సహకరించిన వ్యక్తులు, సూత్రధారులను విడిచిపెట్టబోమని, వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ పేలుడు ఘటనలో మరణించిన వారికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. మృతులకు సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనాన్ని పాటించింది. నవంబర్ 10న రెడ్ ఫోర్ట్ సమీపంలో కారు పేలుడు ద్వారా జాతి వ్యతిరేక శక్తులు హేయమైన ఉగ్ర ఘటనను సృష్టించాయని తీర్మానం పేర్కొంది. పేలుడును భయానకమైన పిరికిపంద చర్యగా క్యాబినెట్ అభివర్ణించింది.
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ పేరు తెరపైకి వచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో దర్యాప్తు సంస్థల దృష్టి ఈ వర్సిటీపై పడింది. ఫరీదాబాద్ పరిధిలోని ధౌజ్ గ్రామంలో 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సంస్థ హర్యానా రాజధానికి కేవలం 30 కి.మీ దూరంలోనే ఉంది. వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్కు, రాడికలైజ్డ్ నిపుణుల బృందం తలపెట్టిన ఒక మారణహోమానికి కేంద్ర బిందువుగా మారింది. పోలీసులు, ఇతర దర్యాప్తు బృందాలు పలువురు సిబ్బందిని ప్రశ్నించారు.
మరో డాక్టర్ మిస్సింగ్
డాక్టర్ ఉమర్ కాకుండా, ఉగ్ర దాడికి సహకరించారని అనుమానిస్తున్న, జైషే మహ్మద్తో సంబంధం ఉన్న అతని ఇద్దరు సహాయకులు డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహిన్ షాహిద్లు కూడా ఇదే విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. డాక్టర్ షకీల్ను అరెస్ట్ చేయడంతో తనను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో ఉమర్ సోమవారం కారు బాంబు పేలుడుకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. డాక్టర్ షాహిన్ కారు నుంచి రైఫిళ్లు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆరుగురిని యూనివర్సిటీ నుంచి అరెస్ట్ చేశారు. పేలుడు అనంతరం మరో డాక్టర్ నిసర్-ఉల్-హసన్ పరారీలో ఉన్నాడు. హసన్ ప్రస్తుతం ఈ యూనివర్సిటీలో మెడిసిన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా ఉన్నారు. దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణపై ఆయనను శ్రీ మహరాజ హరి సింగ్ హాస్పిటల్ నుంచి జమ్ము కశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ విధుల నుంచి తొలగించారు. అయితే ఇలాంటి రికార్డు ఉన్న వ్యక్తిని ఈ యూనివర్సిటీలో ఎలా నియమించారన్న విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వారితో సంబంధం లేదు: వర్సిటీ
బాంబు పేలుడు ఘటనలో అనుమానిత డాక్టర్లు అల్ ఫలాహ్ వర్సిటీకి చెందని వారు కావడంతో తమపై జరుగుతున్న ప్రచారంపై యూనివర్సిటీ స్పందించింది. నిందితులుగా పేర్కొంటున్న డాక్టర్లు తమ విశ్వవిద్యాలయంలో అధికారికంగా పనిచేయడం తప్ప ఆ వ్యక్తులతో తమకు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ భూపీందర్ కౌర్ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు.