న్యూఢిల్లీ, జనవరి 12: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 11వ చైర్మన్గా సీనియర్ రాకెట్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్ సోమనాథ్ను కేంద్రప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఇస్రోకు చైర్మన్గా ఉన్న కే శివన్ వచ్చే శుక్రవారం బాధ్యతలు విరమించనున్నారు. ఇస్రో చైర్మన్ పదవితో పాటు అంతరిక్ష విభాగం కార్యదర్శిగా, స్పేస్ కమిషన్ చైర్మన్గా మూడేండ్లపాటు సోమనాథ్ కొనసాగనున్నారు. ఆయన శుక్రవారం ఇస్రో చైర్మన్గా బాధ్యతలు చేపట్టే అవకాశమున్నది.
‘చంద్రయాన్-2’లో కీలక పాత్ర
1963 జూలైలో కేరళలోని అలప్పుజాలో సోమనాథ్ జన్మించారు. టీకేఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (కొల్లం) నుంచి మెకానికల్ ఇంజినీరింగ్లో డిగ్రీ పూర్తిచేశారు. యూనివర్సిటీ రెండో ర్యాంకర్గా నిలిచారు. ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరులో ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో పీజీ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. 1985లో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (వీఎస్ఎస్సీ)లో పీఎస్ఎల్వీ అభివృద్ధి విభాగానికి టీమ్ లీడర్గా చేరారు. జీఎస్ఎల్వీ ఎంకే-3 లాంచర్ అభివృద్ధిలో, పలు పీఎస్ఎల్వీ మిషన్లలో కీలకపాత్ర పోషించిన సోమనాథ్కు ఇస్రో నుంచి పలు ఎక్స్లెన్స్ అవార్డులు, గోల్డ్ మెడల్స్ లభించాయి. చంద్రయాన్-2, జీశాట్-9 మిషన్లలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2018 జనవరి 22 నుంచి వీఎస్ఎస్సీ డైరెక్టర్గా ఉన్నారు.