న్యూఢిల్లీ : అయోధ్యలో నూతన రామాలయ (Ayodhya Ram Temple) ప్రారంభ వేడుకల నేపధ్యంలో బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధం చెలరేగింది. మందిర ప్రారంభోత్సవానికి కొన్ని పార్టీలు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ఈ అంశంపై రాజకీయ దుమారం రేగుతోంది. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఈ అంశంపై స్పందిస్తూ ఇదంతా రాజకీయ తతంగమని వ్యాఖ్యానిస్తూ బీజేపీ కార్యక్రమానికి హాజరవ్వాలని ఎవరు కోరుకుంటారని ప్రశ్నించారు. ఇది జాతీయ కార్యక్రమం కాదు..ఇది బీజేపీ కార్యక్రమం, ఇది బీజేపీ ర్యాలీ అని వ్యాఖ్యానించారు.
బీజేపీ కార్యక్రమం ముగిసిన అనంతరం తాము అయోధ్యను సందర్శిస్తామని స్పష్టం చేశారు. ఆలయ యంత్రాంగం ఈ వేడుకలను నిర్వహిస్తే అది వేరుగా ఉంటుందని అన్నారు. ఇక జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ సహా ఇతర ప్రముఖుల సమక్షంలో నూతన రామాలయం ప్రారంభోత్సవం జరగనుండగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కాగా ఈ కార్యక్రమానికి ఉద్ధవ్ ఠాక్రేకు ఆహ్వానం అందలేదు.
రాముడిని ఈరకంగా కిడ్నాప్ చేశారని, రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నవారికి దేవుడితో ఎలాంటి బంధం లేదని ఇదంతా కేవలం రాజకీయాల కోసం చేస్తున్నారని రౌత్ ఎద్దేవా చేశారు. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం అయోధ్యను సందర్శించేందుకు ఉద్ధవ్ ఠాక్రేకు ఆహ్వానం అవసరం లేదని అన్నారు. అయోధ్యతో బీజేపీ కంటే శివసేనకు ఎప్పటినుంచో బలమైన అనుబంధం ఉందని స్పష్టం చేశారు.
Read More :