న్యూఢిల్లీ: పార్టీ వేదికలపై ఆత్మవిమర్శ అవసరమే అని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. అయితే ఇది పార్టీ ఆత్మవిశ్వాసం, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, పార్టీలో అంధకారం, వినాశకరమైన వాతావరణాన్ని వ్యాప్తి చేసే విధంగా ఉండకూడదని హితవు పలికారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ నెల 13 నుంచి 15 వరకు జరుగనున్న పార్టీ మేథోమథన సదస్సు అజెండా, ఇతర అంశాలపై చర్చించారు. రాహుల్ గాంధీతోపాటు సీడబ్ల్యూసీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు.
ఉదయ్పూర్ చింతన్ శిబిరంలో సుమారు 400 మంది కాంగ్రెస్ నేతలు పాల్గొంటారని సోనియా గాంధీ తెలిపారు. వీరిలో అత్యధికులు పార్టీలో లేదా కేంద్ర ప్రభుత్వంలో ఏదో ఒక పదవిని కలిగి ఉన్నారని అన్నారు. ఈ నేపథ్యంలో సమతుల్య ప్రాతినిధ్యం, సమతుల్యతను నిర్ధారించడానికి అన్ని ప్రయత్నాలు చేసినట్లు చెప్పారు.
మే 15న సీడబ్ల్యూసీ ఆమోదం తర్వాత ఉదయపూర్ నవ్ సంకల్ప్ను ప్రకటిస్తామని సోనియా తెలిపారు. ఈ చింతన్ శివిర్ ఒక ఆచారంగా మారకూడదన్నారు. సైద్ధాంతిక, ఎన్నికల, నిర్వహణాపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు పునర్నిర్మించిన పార్టీకి అద్దం పట్టేలా ఇది ఉండాలని తాను నిర్ణయించినట్లు తెలిపారు. సభ్యుల ఆమోదంతో పార్టీ రాజ్యాంగ సవరణ కూడా ఉంటుందన్నారు. డిజిటల్ మెంబర్షిప్ అంశానికి సంబంధించిన ఈ సవరణను మీరంతా స్వాగతించి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
Delhi | Congress Working Committee (CWC) meeting underway at AICC headquarters
Track updates – https://t.co/MWXYZ9HQZV pic.twitter.com/iS5CwC1Uxf
— Hindustan Times (@htTweets) May 9, 2022