Sela Tunnel | ఈటానగర్/న్యూఢిల్లీ, మార్చి 9: భారత్-చైనా సరిహద్దుల్లోని తూర్పు సెక్టార్లో నిర్మించిన వ్యూహాత్మక సేలా టన్నెల్ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. అరుణాల్ప్రదేశ్ రాజధాని ఈటానగర్లో నిర్వహించిన ‘వికసిత్ భారత్, వికసిత్ నార్త్ ఈస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఈ టన్నెల్ను వర్చువల్గా జాతికి అంకితం చేశారు.
ఈ టన్నెల్ అరుణాచల్ప్రదేశ్లోని చైనా సరిహద్దు ప్రాంతమైన వ్యూహాత్మక తవాంగ్ రీజియన్కు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కనెక్టివిటీ కల్పిస్తుంది. బలిపారా-చారిదౌర్-తవాంగ్ రోడ్డులో మంచు, కొండ చరియలు విరిగిపడటం వంటి సవాళ్లను అధిగమించే లక్ష్యంతో ఈ టన్నెల్ను నిర్మించారు. దీని ద్వారా అత్యవసర సమయాల్లో భద్రతా బలగాలు, ఆయుధ వ్యవస్థను వాస్తవధీన రేఖ(ఎల్ఏసీ) సరిహద్దు ప్రాంతాలకు వేగంగా చేర్చేందుకు అవకాశం ఉంటుందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలోనే అధిక ఎత్తులో నిర్మించిన అత్యంత పొడవైన రెండు వరుసల టన్నెల్గా సేలా గుర్తింపు పొందింది.