సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (హెచ్ఆర్టీసీ)కి చెందిన ఏకైక మహిళా బస్సు డ్రైవర్ సీమా ఠాకూర్ మరో ఘనత సాధించారు. బుధవారం సిమ్లా-చండీగఢ్ మధ్య ఇంటర్ స్టేట్ రూట్లో తొలిసారి బస్సును నడిపారు. ఇప్పటి వరకు సీమా హిమాచల్ ప్రదేశ్లోనే బస్సును డ్రైవ్ చేయగా తొలిసారి అంతరాష్ట్ర సర్వీసు బస్సును నడిపారు. ‘ఇది గొప్ప అనుభవం. నాకు ఈ అవకాశం లభించినందుకు గర్వంగా ఉన్నది’ అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
సోలన్ జిల్లా ఆర్కికి చెందిన 31 ఏండ్ల సీమా ఠాకూర్ ఐదేండ్ల కిందట హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా ఎంపికయ్యారు. తొలుత ఆమె సిమ్లా నగరంలో ఆ రాష్ట్ర ఆర్టీసీ ట్యాక్సీని నడిపారు. అనంతరం ఆర్టీసీ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సుతోపాటు సిమ్లా-సోలన్ మార్గంలో బస్సును డ్రైవ్ చేశారు.
ఈ నేపథ్యంలో మార్చి 31న సీమా ఠాకూర్ సిమ్లా-చండీగఢ్ మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసును నడిపారు. ఈ ఘనత సాధించిన ఆ రాష్ట్ర తొలి మహిళా డ్రైవర్గా రికార్డు సాధించారు. త్వరలో తాను సిమ్లా-ఢిల్లీ మధ్య బస్సును నడుపుతానని, ఈ మార్గంలో వోల్వో బస్సును తాను డ్రైవ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు.