Seema Haider | పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన యువకుడి కోసం పాక్ నుంచి భారత్ కు వచ్చిన సీమా హైదర్ (Seema Haider)కు తాజాగా బంపర్ ఆఫర్ లభించింది. అక్రమ మార్గంలో భారత్ లోకి అడుగుపెట్టిన ఆమె స్టార్ డమ్ దిశగా పయనిస్తోంది. ఏకంగా సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఉదయ్ పూర్ టైలర్ హత్య నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కోసం సీమా హైదర్ ఆడిషన్స్ ఇచ్చినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.
గతేడాది రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ (Udaipur)కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ సాహూ (Tailor Kanhaiya Lal Sahu) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆయన హత్య ఘటనపై జానీ ఫైర్ ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ ‘ఎ టైలర్ మర్డర్ స్టోరీ’ (A Tailor Murder Story) పేరిట ఓ చిత్రాన్ని త్వరలో తెరకెక్కించనుంది. ఈ సినిమాలోని ఓ పాత్ర కోసం చిత్ర యూనిట్ సీమాను సంప్రదించారు. ఈ మేరకు చిత్ర దర్శకులు జయంత్ సిన్హా, భరత్ సింగ్ లు మంగళవారం ఆమెకు ఆడిషన్స్ నిర్వహించినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. ఈ సినిమాలో సీమా హైదర్ ‘రా’ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
పాక్ జాతీయురాలైన 30 ఏళ్ల సీమా హైదర్.. ఉత్తరప్రదేశ్ కు చెందిన 22 ఏళ్ల సచిన్ మీనా (Sachin Meena)తో పబ్జీ గేమ్ ద్వారా ప్రేమలో పడింది. అతడి కోసం నలుగురు పిల్లలతో సహా పాక్ సరిహద్దును దాటి భారత్ లోకి అక్రమంగా అడుగుపెట్టింది. అనంతరం సచిన్ మీనాను వివాహం చేసుకున్న సీమా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో నివాసముంటోంది.
మరోవైపు భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మామ పాకిస్థాన్ ఆర్మీలో సుబేదార్ కాగా, సోదరుడు కూడా పాక్ ఆర్మీలో సైనికుడని తెలిసింది. ఈ నేపథ్యంలో సీమా హైదర్ను పాకిస్థాన్ స్పైగా అనుమానిస్తున్నారు. అలాగే ఆమెను పాకిస్థాన్కు తిరిగి పంపకపోతే 26/11 తరహా ఉగ్రదాడి జరుగుతుందని హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ముంబై పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అలెర్ట్ అయ్యింది.
Also Read..
Rahul Gandhi | మోదీ ఇంటిపేరు కేసు.. క్షమాపణలు చెప్పేదే లేదన్న రాహుల్
Gyanvapi | జ్ఞానవాపి మసీదులో సర్వేకి అలహాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్