కోల్కతా: రేపు (ఏప్రిల్ 6) హనుమాన్ జయంతి (Hanuman Jayanti) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరి పారా మిలిటరీ బలగాలను తెప్పించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి (West Bengal government) కలకత్తా హైకోర్టు (Calcutta High Court) సూచించింది. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమబెంగాల్లోని హౌరా, హుగ్లీ నగరాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో బెంగాల్ ఉన్నత న్యాయస్థానం ఈ సూచన చేసింది.
హనుమాన్ జయంతి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించడం కోసం పారా మిలిటరీ బలగాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరాలని, అదేవిధంగా ఇటీవల హింసాత్మక ఘటనలు జరిగినందున 144 సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించకూడదని కలకత్తా హైకోర్టు సూచించింది. ఆ తర్వాత కాసేపటికే కేంద్ర హోంశాఖ కూడా శ్రీరామనవమి సందర్భంగా ఎలాంటి హింసకు తావులేకుండా చర్యలు తీసుకోవాలంటూ మార్గదర్శకాలు జారీచేసింది.
శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ముందుజాగ్రత్తగా ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా జరిగిన అల్లర్లపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంగళవారం బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. ఇదిలావుంటే హనుమాన్ జయంతి సందర్భంగా హింసకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని బెంగాల్ సర్కారు కూడా రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసింది.