న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో తీవ్ర భద్రతా లోపం జరిగింది. ఓ దుండగుడు తన కారుతో అసెంబ్లీ లోపలికి ప్రవేశించాడు. గేటును కారుతో ఢీకొట్టి అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లాడు. గేటు నెంబర్ 2 వద్ద మధ్యాహ్నం రెండు గంటలకు ఈ ఘటన జరిగింది. కారుకు యూపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నది. ఆ కారులో వచ్చిన డ్రైవర్.. అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా ఆఫీసు దిశగా వెళ్లాడు. అక్కడ నుంచి వెనుదిరిగే ముందు అతను ఫ్లవర్ బొకే ఉంచినట్లు ఢిల్లీ సెక్రటేరియేట్ అధికారి తెలిపారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. భద్రతా వైఫల్యం జరిగినట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సెక్యూర్టీ ఉల్లంఘన ఘటన కింద దీన్ని భావిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న సమయంలో బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. స్పీకర్ కారుపై ముసుగులో ఉన్న ఓ దుండగుడు ఇంకు చల్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ వ్యక్తి పరారీ అయ్యాడు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ప్రస్తుతం అక్కడ తనిఖీలు నిర్వహిస్తోంది. ఫ్లవర్ బొకేలో ఎటువంటి పదార్ధం లేదని తేల్చారు.