న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: జీ-20 సదస్సు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ భద్రత వలయంలో ఉంది. దేశవిదేశాల నుంచి ప్రముఖులు రానుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఈ సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. రష్యా, అమెరికా, బ్రిటన్, చైనా తదితర దేశాల నుంచి ప్రముఖులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది.
దీంతో రాజధాని నగరంలో భారీగా ఆంక్షలు విధించారు. ఢిల్లీ సరిహద్దు రాష్ర్టాల నుంచి రాకపోకలను నిలిపివేశారు. బ్యాంకులు, ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను మూసివేశారు. నగర రోడ్లలో లక్ష మంది పోలీసులతో నిరంతరం పహారా కాస్తున్నారు. స్నైపర్ శునకాలు, ఏఐ కెమెరాలు, జామర్లు వినియోగించి తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు డ్రోన్లు, ఫైటర్ జెట్లను ఉపయోగించి పహారా కాస్తున్నారు.