బెంగళూర్ : జామియా మసీదు వెలుపల శనివారం హనుమాన్ చాలీసా పఠిస్తామని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) హెచ్చరికల నేపధ్యంలో కర్నాటక రాష్ట్రం మాండ్య జిల్లాలోని మసీదు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వివాదాస్పద మసీదుకు ఒక కిలోమీటర్ పరిధిలో నిరసనలకు దిగుతామని వీహెచ్పీ, బజరంగ్ దళ్లు ప్రకటించాయి.
హిందూ సంస్ధల హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు మసీదు ప్రాంతంలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. మాండ్య జిల్లా శ్రీరంగపట్నం తాలూకాలోని మసీదు వద్ద ఐదు రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ప్లాట్లూన్లను రంగంలోకి దింపారు. వీహెచ్పీ హెచ్చరికల నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని మసీదు ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేయాలని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు.
వీహెచ్పీ నిరసనలకు పిలుపు ఇవ్వడంతో ఇప్పటికే ఆ ప్రాంతంలో నిషేదాజ్ఞలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఈనెల 3 నుంచి 5 వతేదీ మద్యాహ్నం వరకూ అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు జామియా మసీదులో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు జ్ఞాన్వాపీ మసీదు తరహాలో సర్వే నిర్వహించాలని వీహెచ్పీ, బజరంగ్ దళ్ మే 20న మాండ్య జిల్లా కమిషనర్కు వినతి పత్రం సమర్పించాయి.