న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా(Air India) విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్యాసింజెర్ను తేలు(Scorpion) కుట్టింది. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన ఈ ఘటన గురించి వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. నాగపూర్ నుంచి ముంబై వెళ్తున్న ఫ్లయిట్లో ఈ ఘటన జరిగింది. ఎయిర్పోర్టులో దిగగానే ఆ ప్రయాణికురాలికి వైద్యులు చికిత్స అందించారు. ట్రీట్మెంట్ తర్వాత ఆ మహిళను డిస్చార్జ్ చేశారు.
ప్రస్తుతం ఆ ప్రయాణికురాలు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లయిట్ ఏఐ 630లో ఏప్రిల్ 23వ తేదీన ఈ ఘటన జరిగినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రయాణికురాలు ఇచ్చిన ఫిర్యాదు తర్వాత తమ ఇంజనీరింగ్ బృందం ఆ విమానంలో విస్తృతంగా సోదాలు చేసినట్లు ప్రతినిధి చెప్పారు. ప్రయాణికురాలికి కలిగిన అసౌకర్యం పట్ల క్షమాపణలు కోరారు.