Weather : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. నెల్లూరు జిల్లా గూడూరులో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం అక్కడ ఏకంగా 45.8 డిగ్రీ సెల్సియస్ల ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్లో రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 216 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
రేపు (శుక్రవారం) పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల్లోని తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని జైన్ తెలిపారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వివరించారు. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా వర్షం పడే సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు. ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాల హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.