UP Polls : యూపీ కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరు పడ్డ ఆర్పీఎన్ సింగ్ ఉన్న ఫళంగా కాంగ్రెస్కు ఝలక్ ఇచ్చారు. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండానే కాంగ్రెస్కు గుడ్బై చెప్పేశారు. సరిగ్గా ఎన్నికల ముందే కాంగ్రెస్కు ఝలక్ ఇవ్వడం ఆ పార్టీకి శరాఘాతమే. కాంగ్రెస్కు గుడ్బై చెప్పేసి, బీజేపీలో చేరిపోయారు. ఇంత హఠాత్తుగా… ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్కు ఎందుకు గుడ్బై చెప్పారు? ఆయన బీజేపీలో చేరిపోవడానికి మధ్యవర్తిత్వం నడిపిందెవరు? ఎన్ని రోజులుగా ఈ తంతు సాగుతోంది? అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. అయితే ఆర్పీఎన్ సింగ్ లాంటి కరుడుగట్టిన కాంగ్రెస్ వాది బీజేపీలో చేరడానికి వెనుక నుండి యంత్రాంగం నడిపిన వ్యక్తి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. సింధియా కారణంగానే ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్ను వదిలి, బీజేపీలో చేరారని తెలుస్తోంది. ఇదంతా 2 నెలల నుంచే తెర వెనుక మంత్రాంగం నడుస్తోందట.
2 నెలల నుంచి తరచుగా సింధియా ఆర్పీఎన్ సింగ్తో టచ్లో వున్నారు. ఆర్పీఎన్ సింగ్ను ఎప్పుడైతే జార్ఖండ్ వ్యవహారాల ఇన్చార్జీగా నియమించారో.. ఆ రోజు నుంచే సింధియా ఈ మంత్రాంగం నడిపారట. అప్పుడే బీజేపీలో చేరిపోవడానికి ఆర్పీఎన్ సింగ్ సిద్ధపడిపోయారట.అయితే అప్పటికి తేదీ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదని సమాచారం. ఎప్పుడైతే స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీని వీడారో.. అప్పుడే సింధియా ఆర్పీఎన్ సింగ్ను యాక్టివ్ చేశారట. స్వామి మౌర్య లోటును పూడ్చుకోవడానికి బీజేపీ ఆర్పీఎన్ సింగ్ను తెరపైకి తెచ్చింది. ఆర్పీఎన్ సింగ్ బీజేపీలో చేరేటప్పుడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా పక్కనే వున్నారు.
తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్వామి ప్రసాద్ మౌర్య ప్రకటించారు. ఆ తర్వాత ఆయనతో మాట్లాడడానికి ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్షాయే రంగంలోకి దిగారు. ఆయనతో ఫోన్లో మాట్లాడి, బుజ్జగిద్దామని ఏకంగా మూడు సార్లు స్వామికి ఫోన్ చేశారు. మౌర్య ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అమిత్షాకు చిర్రెత్తింది. వెంటనే ఆర్పీఎన్ సింగ్ను యాక్టివ్ చేయాలని భావించారట. ఈ పనిని కేంద్ర మంత్రి, యువనేత జ్యోతిరాదిత్య సింధియాకు అప్పగించారు. సింధియా ఈ పనిని విజయవంతంగా పూర్తి చేశారు.
ఆర్పీఎన్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా స్నేహం చాలా పాతది. వీరిద్దరూ కాంగ్రెస్లో వున్నప్పుడు అత్యంత స్నేహపూర్వకంగా మెలిగేవారు. మధ్యప్రదేశ్ లోని కమల్నాథ్ సర్కార్ను కూల్చడంలో సింధియా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బీజేపీ ఆయన్ను రాజ్యసభకు పంపింది. అగో అప్పటి నుంచే ఆర్పీఎన్ సింగ్ బీజేపీలోకి రావడానికి సింధియా గ్రౌండ్ ప్రిపేర్ చేశారన్న ప్రచారమూ అప్పట్లో జరిగింది.