న్యూఢిల్లీ : గత వారం రోజులుగా రోజుకు దాదాపు 3.82లక్షల మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా బుధవారం తెలిపారు. ఇది కొవిడ్-19 ప్రభావిత రంగానికి ఆశాకిరణంలాంటిదన్నారు. 2023-2024 నాటికి రద్దీని దాదాపు మూడు రెట్లు 400 మిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విమానయాన పరిశ్రమ సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో జెట్, అకాలా త్వరలో కొత్తగా సేవలు ప్రారంభించబోతున్నాయన్నారు.
గత రెండేళ్లలో ప్రభుత్వం రంగంలో మార్పులను తీసుకువచ్చిందని, నిర్మాణాత్మక మార్పు జరిగిందన్నారు. డీజీసీఏ గణాంకాల ప్రకారం.. 2013-14లో ప్రయాణికుల సంఖ్య 6.70కోట్లు కాగా.. 2018-19 సంవత్సరంలో 14.50 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో 2013-14లో విమానాల సంఖ్య 400 కాగా, 2018-19లో 710కి పెరిగింది. డీజీసీఏప్రకారం, 2021 సంవత్సరంలో 838 మిలియన్ల మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారు. 2020లో ఈ సంఖ్య 6.3 కోట్లు. కరోనా మహమ్మారి విమానయాన రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.
దేశీయ, అంతర్జాతీయ నిబంధనల కారణంగా చాలా రోజుల పాటు సేవలను నిలిచిపోయిన విషయం తెలిసిందే. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో తాజాగా విమానయాన రంగం పుంజుకుంటున్నది. నవంబర్ 2021లో దేశంలో ప్రయాణికుల సంఖ్య రోజుకు 3.90లక్షలకు పెరిగిందని, కరోనాకు ముందు రోజుకు ఈ సంఖ్య 4.15 లక్షలుగా ఉండేదన్నారు. ఒమిక్రాన్ ప్రవేశంతో 1.60లక్షలకు తగ్గిందని, ప్రస్తుతం గత వారం రోజులుగా 3.82లక్షలకు పెరిగిందని వివరించారు.