Corona Vaccines | కరోనా మహమ్మారి ఇప్పటికీ పలు నగరాల్లో విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నది. ఈ మహమ్మారికి ఇంకా అంతమెప్పుడో శాస్త్రవేత్తలే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు తర్వాతి తరం (next generation vaccines) వ్యాక్సిన్ల తయారీపై కసరత్తు ప్రారంభించారు. వ్యాక్సిన్ల అభివృద్ధికి దేశంలో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉన్నత స్థాయి ఆరోగ్య నిపుణులు తెలిపారు.
కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ఎన్టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా ప్రకారం.. తర్వాతి తరం వ్యాక్సిన్లు అంటే.. పదే పదే డోసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి వ్యాక్సిన్ వేస్తే అది కరోనా వైరస్ను సైతం కవర్ చేయనున్నది. అలాగే భవిష్యత్లో వచ్చే వైరస్ల చాలాకాలం పాటు రక్షణ ఇవ్వనున్నది. రాబోయే తరం వ్యాక్సిన్లు భవిష్యత్లో వచ్చే వైరస్ నుంచి ప్రజలను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయన్నారు.
స్ట్రెయిన్-స్పెసిఫిక్ వ్యాక్సిన్పై పని చేస్తున్నామని, కొన్ని బైవాలెంట్, రెండు రకాల వైరస్లను, నాలుగు రకాల వైరస్లను కలపడం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. భారతీయ కంపెనీలు, విద్యాసంస్థలు ఈ సవాల్ను స్వీకరించాయని, రాబోయే కొద్ది నెలల్లో మరిన్ని విషయాలు తెలుస్తాయని అరోరా తెలిపారు. దేశంలో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆయన.. ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు.
ఇదిలా ఉండగా.. ఆగస్ట్ 30 నాటికి 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఐదింట మూడోవంతు మందికి బూస్టర్ డోసులను అందించినట్లు ప్రభుత్వ డేటా తెలిపింది. అర్హులైన 768 మిలియన్ల పెద్ద వారిలో 159 మిలియన్లు అంటే.. ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే బూస్టర్ డోస్ తీసుకున్నారు.