చెన్నై: ఇప్పటికే వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తమిళనాడు రాష్ట్రానికి మరో గండం వచ్చిపడింది. రేపు తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. దాంతో రాష్ట్ర రాజధాని చెన్నైలోని తిరునల్వేలితోపాటు మొత్తం ఏడు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించారు.
తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో సోమవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ తెలిపింది. అదేవిధంగా రామనాథపురం, తూత్తుకూడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రెండు రోజుల క్రితం కూడా ఐఎండీ ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదంటూ రెడ్ అలర్ట్ జారీచేసింది. ఆ వర్షాల ధాటికి వరదలు పోటెత్తడంతో 22 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు మూసేశారు.
తమిళనాడులో గత కొంతకాలంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. దాంతో దాదాపు 50 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. పలుచోట్ల భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ పలు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచి ఉన్నది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 2,300కు పైగా ఇండ్లు దెబ్బతిన్నాయి.