జైపూర్: మధ్యప్రదేశ్, యూపీలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ‘మూత్రం’ సంబంధిత అమానుష ఘటనలను మరువక ముందే… కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లోనూ అదే తరహా దారుణం జరిగింది. ఓ విద్యార్థిని మంచి నీళ్ల బాటిల్లో కొంతమంది తోటి విద్యార్థులు మూత్రం పోశారు. లుహారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం ఓ విద్యార్థిని శుక్రవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లగా.. ఆమె నీళ్ల సీసాలో తోటి విద్యార్థులు మూత్రం పోశారు. పాఠశాలకు తిరిగొచ్చిన ఆమె.. నీళ్లు దుర్వాసన వస్తుండడంతో మూత్రం కలిపినట్లు గుర్తించింది. దీంతో పాటు బ్యాగులో ప్రేమ లేఖ ఉండడంతో ఆమె ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కుటుంబ సభ్యులు సోమవారం అధికారులు, పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదు. దీంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. నిందితుల ఇండ్లపై దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై ఇప్పటికీ కేసు నమోదు కాలేదు.