చెన్నై: తమిళనాడులో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ (Toilet) కడుగుతున్న రెండు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. కాంచీపురం, ఈరోడ్ జిల్లాల్లోని సర్కారు స్కూళ్లకు సంబంధించిన ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. కాంచీపురం జిల్లాలోని అలపాక్కమ్ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థిని రెస్ట్ రూమ్ను కడుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తి వీడియో తీశాడు. మరో వీడియోలో ఈరోడ్ జిల్లాలోని పురుందురై గవర్నమెంటు బడిలో పలువురు విద్యార్థులు టాయిలెట్ కడుగుతూ కనిపించారు.
అయితే మొదటి వీడియోను గత ఆదివారం రికార్డు చేశారని విచారణలో తేలింది. దీంతో ఆ విద్యార్థిని ఆదివారం రోజున స్కూల్కు ఎందుకు వెళ్లింది, వీడియోను ఎవరు తీశారనే విషయంపై అధికారులు ఆరాతీస్తున్నారు. అదేవిధంగా ఈరోడ్ స్కూల్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ రెండు సంఘటనల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు డీఈవోలను ఆదేశించారు.