కోల్కతా : పశ్చిమ బెంగాల్లో భానుడి భగభగలతో వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్ధితి నెలకొంది. వృద్ధులు, చిన్నారులు ఎండ వేడిమి తట్టుకోలేక ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఉద్యోగులు మాత్రం తప్పనిసరి పరిస్ధితుల్లో కార్యాలయాలకు చేరుకునేందుకు వడగాడ్పుల్లోనూ గమ్యస్ధానాలకు చేరుకోవాల్సి వస్తోంది.
మండే ఎండల్లో ప్రయాణీకులకు ఊరట ఇచ్చేలా స్కూల్ విద్యార్ధినులు తమ స్కాలర్షిప్ డబ్బుతో బస్సుల్లో ప్రయాణించే వారికి (Viral Post) షర్బత్ పంపిణీ చేస్తున్నారు. బెంగాల్లోని బంకురా జిల్లాలో విద్యార్ధినుల ఔదార్యం పలువురిని ఆకట్టుకుంటోంది. రాజ్ ఖమర్ హైస్కూల్ విద్యార్ధినులు ట్రక్కు డ్రైవర్లు, బస్సుల్లో ప్రయాణించేవారితో పాటు వాహన దారులకు ఉచితంగా షర్బత్ అందచేస్తున్నారు.
ఇది మండే ఎండల నుంచి ప్రయాణీకులకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. సల్వార్ కమీజ్, దుపట్టాలతో ముస్తాబైన విద్యార్ధినులు ప్రయాణీకులకు షర్బత్ ఆఫర్ చేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. విద్యార్ధినులు పెద్దమనసుతో ఇలా చేయడం ప్రశంసనీయమని పోలీస్ అధికారులు సైతం ప్రశంసలు గుప్పిస్తున్నారు.
Read More