బెంగళూరు: విద్యార్థులకు నాన్వెజ్ ఫుడ్ పెట్టినందుకు స్థానిక అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ మూసివేతకు ఆదేశాలిచ్చారు. దీనిపై విమర్శలు రావడంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇల్కల్ పట్టణంలోని సెయింట్ పాల్స్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా విద్యార్థులకు మాంసాహారం వడ్డించారు. ఈ విషయం తెలిసిన హిందూ రైట్వింగ్ గ్రూపులు నిరసన వ్యక్తం చేశాయి. స్కూల్ పిల్లలను క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని, బైబిల్ను నమ్మేలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారని ఆరోపించారు.
కాగా, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దృష్టికి ఇది వెళ్లింది. దీంతో స్కూల్ను తాత్కాలికంగా మూసివేయాలంటూ ఆయన ఆదేశించారు. ఈ మేరకు స్కూల్కు ఒక లెటర్ రాశారు. ‘మీరు వేడుకల సమయంలో విద్యార్థులకు మాంసాహారం వడ్డించినట్లు మా దృష్టికి వచ్చింది. డిపార్ట్మెంట్తోపాటు ప్రజలకు ఇది ఇబ్బంది కలిగించింది. కాబట్టి, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలను మూసివేయాలి’ అని అందులో పేర్కొన్నారు.
అయితే బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జారీ చేసిన ఈ ఆదేశాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం రాష్ట్ర విద్యాశాఖ దృష్టికి వెళ్లింది. దీంతో ఈ ఉత్తర్వులను రద్దు చేసింది. జిల్లా కమిషనర్కు లేదా విద్యాశాఖకు సమాచారం ఇవ్వకుండానే స్థానిక అధికారి పాఠశాలను మూసివేయాలని ఆదేశించినట్లు తమకు తెలిసిందని విద్యా శాఖ పేర్కొంది. ‘మాంసాహారాన్ని ఇచ్చినందుకు పాఠశాలను మూసివేయలేము. ఈ ఉత్తర్వును రద్దు చేశాం’ అని విద్యా శాఖ శుక్రవారం తెలిపింది.