చెన్నై: స్కూల్ సమీపంలో మద్యం షాపు ఉండటంపై ఇద్దరు విద్యార్థులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు ఆ మద్యం షాప్ను మూసివేసి మరో చోటకు తరలించాలని ఆదేశించారు. తమిళనాడు అరియలూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో నవంబర్ నుంచి ప్రాథమిక స్కూళ్లు తెరువనున్నారు. అక్కా, తమ్ముడైన ఇలంతేంద్రల్, అరివరసన్ 6వ, 4వ తరగతులు చదువుతున్నారు.
అయితే తమ స్కూలుకు సమీపంలో మద్యం షాపు ఉండటంపై వారిద్దరు జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. స్కూళ్లు తెరిచేలోపు దానిని మూసివేయాలని కోరారు. ‘వారు అక్కడ తాగుతారు. అక్కడ కూర్చుని అసభ్యంగా మాట్లాడతారు. ఇది మాకు చాలా భయంగా ఉంది. మద్యం వల్ల చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పనికి పంపి భిక్షాటన చేయిస్తున్నారు. అన్ని మద్యం దుకాణాలను మూసివేస్తే అలాంటి సమస్య ఉండదు’ అని మీడియాతో అన్నారు.
విద్యార్థుల లేఖపై అరియలూర్ కలెక్టర్ పీ రమణ సరస్వతి స్పందించారు. కోర్టు నిబంధనల ప్రకారం పాఠశాలకు 100 మీటర్ల దూరంలో మద్యం షాపు ఉన్నదని తెలిపారు. అయినప్పటికీ స్కూల్ పిల్లల ఫిర్యాదుతో దానిని మూసివేసి మరో చోటకు మార్చాలని ఆదేశించినట్లు చెప్పారు.
మరోవైపు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని తోబుట్టువులైన ఇలంతేంద్రల్, అరివరసన్ తాజాగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ పిల్లల చొరవను తమిళనాడు ప్రజలు ప్రశంసిస్తున్నారు. ‘అలాంటి వారే మన నాయకులు. మన సమాజంలో మార్పు తీసుకువచ్చే బాధ్యత, ధైర్యాన్ని వారు చూపారు’ అని చెన్నైలోని సామాజిక కార్యకర్త ప్రణిత తిమోతీ అన్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులు బుక్ షాప్ నిర్వహిస్తున్నారని చెప్పారు.