రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఏర్పాటుచేస్తామన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రధాని ఇటీవలి పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతాలోపాలపై దర్యాప్తునకు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రధానమంత్రి భద్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పేర్కొన్నది. ప్యానల్లో చండీగఢ్ డీజీపీ, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్, పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ నుంచి మరో వ్యక్తి సభ్యులుగా ఉంటారని తెలిపింది. కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలు వేసిన కమిటీల దర్యాప్తుపై స్టే కొనసాగుతుందని స్పష్టంచేసింది. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ ఘటనలో పంజాబ్ సీఎం చన్నీతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారుల పాత్రపై దర్యాప్తు జరుపాలని న్యాయవాది బారున్ కుమార్ సిన్హా పిటిషన్ దాఖలు చేశారు.
దర్యాప్తును ఆపాలంటూ లాయర్స్కు బెదిరింపులు
మోదీ పంజాబ్ పర్యటనలో ఆయన కాన్వాయ్ నిలిచిపోవడానికి కారణం తామేనంటూ సిక్కు వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) ప్రకటించుకున్నట్టు తెలిసింది. భద్రతా వైఫల్యంపై దర్యాప్తును ఆపాలంటూ ఎస్ఎఫ్జే నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది. ఘటనపై విచారణ జరుపవద్దంటూ న్యాయమూర్తులనూ బెదిరించినట్టు కోర్టుకు తెలిపింది.