న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలోని విరాళాలు చోరీ అయినట్లు జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ సంచలనాత్మక రిపోర్టింగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ జర్నలిస్టుపై ఇప్పుడు రోడ్ రేజ్ కేసు నమోదు అయ్యింది. దీంతో అభిషేక్ సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. అభిషేక్పై నమోదు అయిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని ఆయన తరపున కౌన్సిల్ సుప్రీంకోర్టును కోరారు. అయితే ఆ కేసును మంగళవారం విచారించనున్నట్లు అత్యున్నత న్యాయ స్థానం పేర్కొన్నది. అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసును బహిర్గతం చేయడం వల్లే తనపై ఘజియాబాద్ పోలీసులు రోడ్ రేజ్ కేసు పెట్టినట్లు అభిషేక్ తన పిటీషన్లో ఆరోపించారు. ఎస్-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద తనపై కేసు కూడా బుక్ చేశారన్నారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జోయ్మాల్యా బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం ఈ కేసును రేపు విచారించనున్నది.
జర్నలిస్టు అభిషేక్పై అనేక ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని, కఠినమైన ఎస్సీ-ఎస్టీ చట్టం కింద కూడా ఓ కేసు దాఖలైందని, 20వ తేదీన పోలీసులు తన ఇంటిని రెయిడ్ చేశారని, నిన్న కూడా 5 గంటలకు పోలీసులు వచ్చారని, రిట్ పిటీషన్ దాఖలు చేస్తున్నానని, ఇవాళ లేదా రేపైనా విచారణ చేపట్టాలని జర్నలిస్టు తరపున న్యాయవాది సుప్రీంను కోరారు. అయితే ఆ పరిశీలిన పరిగణలోకి తీసుకున్న సీజేఐ.. ఈ కేసును మంగళవారం విచారించనున్నట్లు చెప్పారు. రామమందిరంలో జరిగిన అవినీతితో పాటు జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ అనేక ఇన్వెస్టిగేటివ్ అంశాల్లో రిపోర్టింగ్ చేశాడు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు సన్నిహితంగా ఉండే ఓ ఐఏఎస్ గురించి కూడా అతను సంచలనాత్మక కథనాన్ని అందించాడు. బదోయి వద్ద 2023లో 20 కోట్ల వ్యవసాయ భూమి కొన్ని కేసులో జర్నలిస్టు అభిషేక్ ఓ వివాదాస్పద రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది.
జర్నలిస్టు అభిషేక్ తన వాహనంతో వెనుక నుంచి ఢీకొట్టినట్లు ఆగస్టు 18వ తేదీన ఓ టూవీలర్ రైడర్ ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత తనను బెదిరించి, దూషించాడు అని కూడా ఆ ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. భారతీయ న్యాయ సంహితతో పాటు ఎస్సీ-ఎస్టీ చట్టం కింద అభిషేక్పై కేసు బుక్ చేశారు. అయితే ఆ ఆరోపణలు అన్నీ నిరాధారమైనవని ఉపాధ్యాయ తెలిపారు. తన కుమార్తెను స్కూల్ నుంచి తీసుకువస్తున్న సమయంలో.. ఓ వ్యక్తి తన కారుకు అడ్డం వచ్చి గొడవ సృష్టించినట్లు జర్నలిస్టు తెలిపాడు. తనతో పాటు కూతురు ఉండడం వల్ల ఎటువంటి గొడవ పడలేదన్నారు. అయితే తనమీద కక్షతోనే రాష్ట్ర ప్రభుత్వం రోడ్ రేజ్ కేసు బుక్ చేసిందని ఉపాధ్యాయ ఆరోపించాడు. ఘటన చోటుచేసుకున్న ప్రదేశానికి వెళ్లి షాపుల్లో ఉన్న సీసీటీవీలను పరిశీలించాలని తోటి జర్నలిస్టులను కోరినట్లు ఉపాధ్యాయ తెలిపాడు. కానీ పోలీసుల దాని కన్నా ముందే ఆ వీడియోలను డిలీట్ చేయించినట్లు ఉపాధ్యాయ ఆరోపించారు.
టూవీలర్ ఓనర్ ఫిర్యాదు చేయలేదని, మరో వ్యక్తి ఫిర్యాదు చేశాడని పిటీషన్లో పేర్కొన్నారు.