ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం అసెంబ్లీలో గురువారం బలపరీక్ష ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గవర్నర్ భగత్ సింగ్ కోశియారి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. బలపరీక్షను సవాల్ చేసిన శివసేనకు ఎలాంటి ఊరట లభించలేదు. శివసేన నేత ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేల తిరుగుబాటు వల్ల మహారాష్ట్రలో తలెత్తిన అన్ని రాజకీయ సంక్షోభాలకు ఫ్లోర్ టెస్ట్ ఒక్కటే మార్గమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ కేసును అత్యవసరంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టును బుధవారం కోరారు. దీంతో జస్టిస్ సూర్యకాంత్, జేబీ పార్దివాలాతో కూడిన వెకేషన్ బెంచ్ బుధవారం సాయంత్రం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. సుమారు మూడు గంటలపాటు వాదనలు జరిగాయి. గవర్నర్ భగత్ సింగ్ కోశియారితో బీజేపీ నేత దేవేందర్ ఫడ్నవీస్ భేటీ అయ్యాక సూపర్ సోనిక్ స్పీడ్లో ఫ్లోర్ట్ టెస్ట్పై నిర్ణయం తీసుకున్నారని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఆరోపించారు. ప్రభుత్వంలో భాగమైన ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకిందని, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉన్నారని తెలిపారు. ‘బలపరీక్ష రేపు జరుగకపోతే ఆకాశం ఊడిపడదుగా’ అని అన్నారు. స్పీకర్ చేతులు కట్టేసి ఫ్లోర్ టెస్ట్ నిర్వహించడం సరికాదని వ్యాఖ్యానించారు. బలపరీక్షను ఒక వారానికి వాయిదా వేయాలని లేదా అనర్హత నోటీసులపై స్పీకర్ నిర్ణయాన్ని అనుమతించే వీలుగా ఆ విచారణ ముందుకు జరుపాలని కోర్టును కోరారు.
మరోవైపు శివసేన రెబల్ నేత షిండే వర్గం తరపున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదించారు. సభ్యుల అనర్హత ప్రక్రియ లేదా ఎమ్మెల్యేల రాజీనామాలు బలపరీక్ష ఆలస్యం కావడానికి కారణం కాకూడదని అన్నారు. దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పును ఆయన గుర్తు చేశారు. ఎంఏవీ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయినా అధికారంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. షిండే వర్గం అసమ్మతి వర్గం కాదని, నిజమైన శివసేన అని ఆయన తెలిపారు. 55 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది షిండేకు మద్దతుగా ఉన్నారని చెప్పారు. అయితే అనర్హతకు గురయ్యే ఎమ్మెల్యేలను కూడా ఓటింగ్కు అనుమతిస్తే ప్రజాస్వామ్యం మూలాలను కత్తిరించేందుకు అనుమతిస్తుందని ప్రభుత్వం తరుఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, గవర్నర్ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పీకర్ను సుప్రీంకోర్టు అడ్డుకోలేదని, ఆ పని చట్టం చేసిందన్నారు. ఫ్లోర్ టెస్ట్కు ఆదేశించకపోతే విధి నిర్వహణలో నిర్లక్ష్యం జరుగుతుందని మెహతా అన్నారు. ‘ప్రజాస్వామ్యంలో అధికారానికి మూలం సభ కాబట్టి ఫ్లోర్ టెస్ట్ తప్పనిసరి అని, అందుకే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
మూడు గంటలపాటు అన్ని వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు చివరకు బలపరీక్ష వైపే మొగ్గు చూపింది. ‘అన్ని సమస్యలు పరిష్కారమవడానికి హౌస్ ఆఫ్ ఫ్లోర్ మాత్రమే మార్గమని మేం భావిస్తున్నాం. తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై దాఖలైన పిటిషన్ను కోర్టు ప్రత్యేకంగా విచారిస్తుంది’ అని పేర్కొంది. అలాగే ఫ్లోర్ టెస్ట్లో పాల్గొనేందుకు అనుమతించాలని జైల్లో ఉన్న ఎన్సీపీ నేతలు అనిల్ దేశ్ముఖ్, నవాబ్ చేసిన అభ్యర్థనలపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. వారు ఓటింగ్లో పాల్గొనేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.