న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరి ఘటనలో సాక్షులకు భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. ఈ ఘటనలో ఇతర సంబంధిత సాక్షుల స్టేట్మెంట్లను జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ల ఎదుట రికార్డు చేయాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ యూపీ ప్రభుత్వాన్ని కోరింది. పలువురు సాక్షుల స్టేట్మెంట్లను ఇంకా నమోదు చేయాల్సి ఉందని యూపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, గరిమ ప్రసాద్లు సర్వోన్నత న్యాయస్ధానానికి వివరించిన మీదట కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
లఖింపూర్ ఖేరిలో రైతుల ఆందోళన సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో ఎనిమిది మంది మరణించిన ఘటనలో 68 మంది సాక్షులకు గాను కేవలం 20 మంది సాక్షులే తమ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఆధారాలపై నివేదికల తయారీ విషయంలో తమ ఆందోళనను ఫోరెన్సిక్ ల్యాబ్లు, నిపుణులకు తెలపాలని సుప్రీం బెంచ్ యూపీ ప్రభుత్వాన్ని కోరింది.
జర్నలిస్ట్ మూక హత్య సహా రెండు ఫిర్యాదులపై నివేదిక సమర్పించాలని కూడా సర్వోన్నత న్యాయస్ధానం యూపీ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అంశంపై తదుపరి విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది. కాగా లఖింపూర్ ఖేరిలో ఆందోళన చేపట్టిన రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు చెందినదిగా భావిస్తున్న ఎస్యూవీ దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించగా అనంతరం జరిగిన ఘర్షణలో మరో నలుగురు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.