న్యూఢిల్లీ, నవంబర్ 23: పవర్ టారిఫ్ నిర్ధారణకు మూడు నెలల్లోగా విధివిధానాలు రూపొందించాలని అన్ని రాష్ర్టాల విద్యుత్తు నియంత్రణ సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనల రూపకల్పనకు విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్ 61లో పొందుపరిచిన మార్గదర్శకాలను అనుసరించాలని కోర్టు స్పష్టంచేసింది.
అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై ఇన్ఫ్రా లిమిటెడ్కు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ లైసెన్స్ జారీచేయడాన్ని అప్పిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ(ఏపీటీఈఎల్) సమర్థించింది. దీన్ని వ్యతిరేకిస్తూ టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ కోర్టు పై ఆదేశాలు జారీచేసింది. టారిఫ్ బేస్డ్ కాంపిటీటివ్ బిడ్డింగ్ను అనుసరించలేదని పేర్కొంటూ టాటా సంస్థ అదానీ గ్రూప్ లైసెన్స్ను వ్యతిరేకించింది.