న్యూఢిల్లీ: ఆర్ధికంగా వెనుబడిన వర్గాలవారికి విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించే అంశంపై సుప్రీంకోర్టు ఈనెల 9వ తేదీన విచారణ చేపట్టనున్నది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటా(EWS quota)ను సుప్రీం సమర్ధించిన విషయం తెలిసిందే. అయితే ఆ కోటాను సవాల్ చేస్తూ సుమారు 9 రివ్యూ పిటీషన్లు కోర్టులో దాఖలు చేశారు. ఆ పిటీషన్లపై అయిదుగురు సభ్యుల ధర్మాసనం విచారించనున్నది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఆ వాదనలు సాగనున్నాయి.
గత ఏడాది నవంబర్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాకు సుప్రీం 3-2 తేడాతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ కోటాకు ముగ్గురు జడ్జీలు అనుకూలంగా ఉండగా, మరో ఇద్దరు ఆ కోటాను వ్యతిరేకించారు. 103వ రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తే దాఖలైన పిటీషన్లను గతంలో మాజీ సీజేఐ యూయూ లలిత్ బెంచ్ విచారించింది. ఆ బెంచ్లో జస్టిస్ దీనేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ జేబీ పర్దివాలా ఉన్నారు.