న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం పంపిన సిఫారసులను పదేపదే వెనక్కి తిప్పి పంపడం సరికాదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జడ్జీలుగా నియమించాలని పలువురి పేర్లను మరోసారి కేంద్రానికి పంపింది. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచినంత మాత్రాన లేదా గే అయినంత మాత్రాన వారు జడ్జి పదవికి అనర్హులు కాబోరని స్పష్టం చేసింది. తాను గే అని బహిరంగంగా ప్రకటించిన సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కేంద్రానికి మరోసారి సిఫారసు చేసింది.
ఈ ప్రతిపాదన కేంద్రం వద్ద ఐదేండ్లకుపైగా పెండింగ్లో ఉన్నదని, వేగవంతగా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించింది. కొలీజియం సిఫారసును కేంద్రం ఆమోదిస్తే.. దేశంలో రాజ్యాంగ కోర్టుకు న్యాయమూర్తిగా నియమితులైన తొలి గే జడ్జిగా కిర్పాల్ ఘనత సాధిస్తారు. ‘కిర్పాల్ నియామకంపై కేంద్రం రెండు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. ఒకటి కిర్పాల్ భార్య స్విట్జర్లాండ్కు చెందినవారని, రెండోది ఆయన గే అని, అందుకే పునఃపరిశీలించాలని వెనక్కి పంపుతున్నామని కేంద్రం చెప్తున్నది. అయితే రాజ్యాంగ పదవులను నిర్వర్తించిన, నిర్వర్తిస్తున్న వారిలో ఎంతో మంది భార్యలు విదేశాల్లో పుట్టినవాళ్లే’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.
ప్రధానిపై పోస్ట్ షేర్ చేస్తే జడ్జీగా నియమించరా?
ప్రధాని మోదీని విమర్శించేలా ఉన్న పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేసిన న్యాయవాది ఆర్ జాన్ సత్యంను మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి కేంద్రానికి సిఫారసు చేసింది. ఆయన చేసిన సోషల్మీడియా పోస్టులపై ఇంటెలిజెన్స్ బ్యూరో అభ్యంతరాలను తోసిపుచ్చింది. అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తపరిచినంత మాత్రాన జడ్జి పదవికి అనర్హలు కాబోరని స్పష్టంచేసింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఆయనకు మంచి ఇమేజ్ ఉన్నదని ఐబీ తన నివేదికలో పేర్కొన్న విషయాన్ని గుర్తుచేసింది. న్యాయవాదులు అమితేశ్ బెనర్జీ, సక్యా సేన్లను కలకత్తా హైకోర్టు జడ్జిలుగా నియమించాలని మరోసారి కేంద్రానికి సిఫారసు చేసింది.