Satyendar Jain | మనీ లాండరింగ్ కేసులో అరెస్టు అయి, తీహార్ జైలులో (Tihar Jail) ఉన్న ఢిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ (Satyendar Jain) గాయపడ్డారు. జైలు బాత్రూమ్లో (Bathroom) కాలుజారి కిందపడిపోవడంతో స్వల్పంగా గాయపడ్డారు. దీంతో అధికారులు ఆయనను దీన్ దయాళ్ ఉపాధ్యాయ దవాఖానకు (DDU Hospital) తరలించారు. వైద్యులు ఆయనను పరిశీస్తున్నారని చెప్పారు. బుధవారం రాత్రి సత్యేంద్ర జైన్ జైలు బాత్రూమ్లో జారి కిందపడిపోయారని జైలు అధికారులు వెల్లడించారు. దీంతో ఆయన స్వల్పంగా గాయాలయ్యాయని, వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించామన్నారు.
ఈ నెల 22న స్వల్ప అస్వస్థతకు గురవడంతో జైలు అధికారులు ఆయనను ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ దవాఖానకు (Safdarjung Hospital) తరలించిన విషయం తెలిసిందే. జైలులో ఒంటరితనం వల్ల తాను ఆందోళనకు గురవుతున్నారని ఇటీవల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ న్యాయస్థానాల్లో ఊరట లభించలేదు. జైన్ ఆరోగ్యంపై న్యాయవాది గత వారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీలో సత్యేందర్ జైన్ ఏకంగా 35 కిలోల బరువు తగ్గారని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు. మనీ ల్యాండరింగ్ కేసులో గత ఏడాది మే 31న ఈడీ అధికారులు జైన్ను అరెస్ట్ చేశాయి.