షిల్లాంగ్ : గతేడాది డిసెంబర్లో రైతులకు ఇచ్చిన హామీని కేంద్రం ఇప్పటి వరకు నెరవేర్చలేదని, కేంద్ర ప్రభుత్వంపై ఎంఎస్పీపై చట్టం చేయాలని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. నవంబర్ 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాకు చెందిన వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఏడాదికిపైగా రైతులు ఆందోళన చేపట్టగా.. గత డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
రైతుల మిగతా డిమాండ్లను పరిశీలిస్తామని కేంద్రం ప్రకటించగా.. సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో మరోసారి ఎంఎస్పీపై మేఘాలయ గవర్నర్ ప్రస్తావించారు. ఇదే సమయంలో దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యను లేవనెత్తారు. దేశంలోని యువత ఉద్యోగాలు లేకుండా వీధుల్లో తిరుగుతున్నారన్నారు. యూపీలో బూల్డోజర్ల వ్యవహారంపై సత్యపాల్ మాలిక్ స్పందిస్తూ.. సమయం ఇవ్వకుండా పేదల ఇండ్లు కూల్చివేయడం సరికాదన్నారు.