హైదరాబాద్, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రసంగిస్తున్న సమయంలో బడ్జెట్ నేపథ్య మీమ్స్, పోస్టులు సోషల్మీడియాలో హల్చల్ చేశాయి. నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టే చివరి పూర్తి బడ్జెట్ ఇదే కావడంతో నెటిజన్లు సరదా పోస్టులు, మీమ్స్తో చురకలంటించారు. ‘నేను హల్వా తినను..నేను కేవలం జీఎస్టీ మాత్రమే తింటాను’ అని మంత్రి నిర్మల ఫొటోతో ఓ యూజర్ వ్యంగ్యాస్త్రం విసిరారు. సమర్థవంతంగా బడ్జెట్ ఎలా తయారుచేయాలో చాట్జీపీటీని అడిగి తెలుసుకోవాలని మరో యూజర్ సలహా ఇచ్చారు.
ఆదాయపు పన్ను మినహాయింపు అంటూ మోసం చేసిందని ‘నిర్మలాతాయి’ అనే యూజర్ ఇందులో మతలబును బయటపెట్టారు. పాత పన్ను విధానంలో 1.5 లక్షల 80సీ మినహాయింపు ఉందని, ఆదాయం రూ.7 లక్షలున్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు కొత్త విధానంలో దాన్నే ‘ఏడు లక్షల వరకు పన్ను మినహాయింపు’ అంటూ ఫూల్స్ చేస్తున్నదని విమర్శనాస్ర్తాలు సంధించారు. 2020 ఫైనాన్స్ యాక్ట్ ద్వారా ఇన్కంట్యాక్స్లో పొందుపరిచిన 115బీఏసీ సెక్షన్ను ఉపయోగించుకొని ప్రజల ఎమోషన్స్తో కేంద్ర సర్కారు ఆడుకుంటున్నదని ఓ యూజర్ మండిపడ్డారు. ప్రస్తుతం రూ. 575 మాత్రమే అకౌంట్లో ఉన్న తనకు మోదీ సర్కారు ఆదాయ పన్ను పరిమితిని పెంచడం ఆనందం కలిగించిందంటూ ఓ సామాన్యుడు డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన ఓ నెటిజన్.. బడ్జెట్తో నిరుపేదలకు ఒరిగిందేమీ లేదని చెప్పకనే చెప్పారు.