Muslim Inmates | ముంబై : మహారాష్ట్రలోని సతరా జిల్లా జైల్లో ముస్లిం ఖైదీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ముస్లిం ఖైదీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. దీంతో ఆ జైల్లో శిక్ష పొందుతున్న ముస్లిం ఖైదీలందరూ జైలు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ముస్లిం ఖైదీలకు ప్రత్యేక బ్యారక్లు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం, సాయంత్రం వారికి ఆహారం వడ్డించేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించినట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 5 గంటల్లోపు, సాయంత్రం 6 గంటల తర్వాత ఉపవాస దీక్షలు విరమిస్తారు. ఖైదీల ఉపవాస దీక్షకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు జైలు అధికారులు స్పష్టం చేశారు.
హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అందర్నీ జైలు అధికారులు గౌరవిస్తారని, వారి వారి పండుగలను జైలు ఆవరణలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని మతాల వారిని సమానంగా చూస్తున్నట్లు చెప్పారు. దీంతో జైలులో ఓ మంచి వాతావరణం ఏర్పడుతుందని, ఒకరినొకరు గౌరవించుకుంటారని తెలిపారు.