న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని బజాజ్ ఫిన్ సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్ అన్నారు. ఏడాది చివరికి పెద్దలందరికీ టీకాలు ఇచ్చేలా రోజుకు 70 లక్షల మందికి వ్యాక్సిన్ అందించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
థర్డ్ వేవ్ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టడంతో పాటు సన్నద్ధంగా ఉండాలని ఓ బిజినెస్ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. సెకండ్ వేవ్ కట్టడికి ఎక్కడికక్కడ విధించిన లాక్ డౌన్ ల నుంచి వ్యూహాత్మకంగా అన్ లాక్ ప్రక్రియలోకి మారాలని అన్నారు. వ్యాక్సిన్ల లభ్యతను పెంచి సరఫరాలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. కొవిడ్-19 వ్యాక్సిన్ల కొరతను అధిగమించేందుకు దేశీ వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడం, విదేశాల నుంచి వ్యాక్సిన్ల దిగుమతి ముమ్మరంగా చేపట్టాలని చెప్పారు.